అర్వింద్‌కు కేంద్రమంత్రి పదవి?

by Disha Web Desk 4 |
అర్వింద్‌కు కేంద్రమంత్రి పదవి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ మరింత బలం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో రాష్ట్రానికి మరో మంత్రి ఇచ్చే చాన్స్ కనిపిస్తున్నది. ఇప్పటికే కిషన్ రెడ్డి సెంట్రల్ కేబినెట్‌లో ఉన్నారు. అందుకని ఈసారి బీసీ వర్గానికి చెందిన ఎంపీని కేబినెట్‌లోకి తీసుకుని సహాయ మంత్రి పదవి ఇస్తారనే టాక్ ఉంది. కేబినెట్ రేసులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య పీఎం మోడీ ఆ ఇద్దరు ఎంపీలతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్నది.

బీసీలకు పెద్దపీట

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం అన్ని వర్గాలను దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తూనే, బీసీ జనాభా అధికంగా ఉన్నందునే ఆ వర్గానికి చెందిన లీడర్లకు ప్రియారిటీ ఇస్తున్నది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీ వర్గానికి చెందిన డాక్టర్ లక్షణ్‌కు జాతీయ పార్టీ ఓబీసీ మోర్చ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది. ఇప్పుడు కేబినెట్ విస్తరణలో బీసీ వర్గానికి చెందిన లీడర్లకు కేబినెట్ పదవి దక్కే అవకాశాలు కనపడుతున్నాయి.

ధర్మపురి, లక్ష్మణ్ బలాబలాలు

సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రం నుంచి కేబినెట్‌లోకి ధర్మపురి అర్వింద్, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే మోడీ రీసెంట్‌గా వారితో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ధర్మపురిని కేబినెట్‌లోకి తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయనే టాక్ ఉంది. బీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా గెలిచినప్పట్నించి కేసీఆర్ ఫ్యామిలీతో నేరుగా ఫైట్ చేస్తున్నారు. ఇక డాక్టర్ లక్ష్మణ్ రాజకీయ జీవితం మొత్తం బీజేపీతో ముడిపడి ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆయనకు సౌమ్యుడని పేరు ఉంది.

ఉత్తర తెలంగాణకు ప్రియారిటీ

ఉత్తర తెలంగాణ నుంచి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది. ఆ ప్రాంత లీడర్లను కేబినెట్‌లోకి తీసుకుంటే పార్టీ మరింత బలపడుతోందని కేంద్ర నాయకత్వం భావిస్తోనట్టు తెలిసింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి కేబినెట్‌లో ఉన్నారు. లక్ష్మణ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే హైదారబాద్ లీడర్లకే మళ్లీ ప్రియారిటీ ఇచ్చినట్టు అవుతోందా అనే కోణంలో అలోచిస్తునట్టు సమాచారం.

బండి కొనసాగింపు..

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగించేందుకు కేంద్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నదని తెలిసింది. సంజయ్‌కు పార్టీ పగ్గాలు అప్పచెప్పిన తర్వాతే రాష్ట్రంలో పార్టీ బలోపేతమైందని అభిప్రాయం ఉంది. అందుకని ఆయన నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమిక నిర్ణయానికి సెంట్రల్ లీడర్ షిప్ వచ్చినట్టు టాక్ ఉంది.

Read More...

Revanth Reddy: ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్! రేవంత్ పరిస్థితేంటి?

Next Story

Most Viewed